Wednesday, 20 January 2021

శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం

 

శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే భోగీంద్రభోగమణిరాజిత పుణ్యమూర్తే |
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ||

బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత |
లక్ష్మీలసత్కుచసరోరుహరాజహంస లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ||

సంసారదావదహనాకరభీకరోరు-జ్వాలావళీభిరతిదగ్ధతనూరుహస్య |
త్వత్పాదపద్మసరసీరుహమాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ||

సంసారజాలపతితతస్య జగన్నివాస సర్వేంద్రియార్థ బడిశాగ్ర ఝషోపమస్య |
ప్రోత్కంపిత ప్రచురతాలుక మస్తకస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ||

సంసారకూమపతిఘోరమగాధమూలం సంప్రాప్య దుఃఖశతసర్పసమాకులస్య |
దీనస్య దేవ కృపయా పదమాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ||

సంసారభీకరకరీంద్రకరాభిఘాత నిష్పీడ్యమానవపుషః సకలార్తినాశ |
ప్రాణప్రయాణభవభీతిసమాకులస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ||

సంసారసర్పవిషదిగ్ధమహోగ్రతీవ్ర దంష్ట్రాగ్రకోటిపరిదష్టవినష్టమూర్తేః |
నాగారివాహన సుధాబ్ధినివాస శౌరే లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ||

సంసారవృక్షబీజమనంతకర్మ-శాఖాయుతం కరణపత్రమనంగపుష్పమ్ |
ఆరుహ్య దుఃఖఫలితః చకితః దయాళో లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ||

సంసారసాగరవిశాలకరాళకాళ నక్రగ్రహగ్రసితనిగ్రహవిగ్రహస్య |
వ్యగ్రస్య రాగనిచయోర్మినిపీడితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ||

సంసారసాగరనిమజ్జనముహ్యమానం దీనం విలోకయ విభో కరుణానిధే మామ్ |
ప్రహ్లాదఖేదపరిహారపరావతార లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ||

సంసారఘోరగహనే చరతో మురారే మారోగ్రభీకరమృగప్రచురార్దితస్య |
ఆర్తస్య మత్సరనిదాఘసుదుఃఖితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ||

బద్ధ్వా గలే యమభటా బహు తర్జయంత కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మామ్ |
ఏకాకినం పరవశం చకితం దయాళో లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ||

లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో యఙ్ఞేశ యఙ్ఞ మధుసూదన విశ్వరూప |
బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ||

ఏకేన చక్రమపరేణ కరేణ శంఖ-మన్యేన సింధుతనయామవలంబ్య తిష్ఠన్ |
వామేతరేణ వరదాభయపద్మచిహ్నం లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ||

అంధస్య మే హృతవివేకమహాధనస్య చోరైర్మహాబలిభిరింద్రియనామధేయైః |
మోహాంధకారకుహరే వినిపాతితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ||

ప్రహ్లాదనారదపరాశరపుండరీక-వ్యాసాదిభాగవతపుంగవహృన్నివాస |
భక్తానురక్తపరిపాలనపారిజాత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ||

లక్ష్మీనృసింహచరణాబ్జమధువ్రతేన స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ |

యే తత్పఠంతి మనుజా హరిభక్తియుక్తా-స్తే యాంతి తత్పదసరోజమఖండరూపమ్ ||

ఈ శ్లోకాలు చదివిన, మనకు మానసిక ఆనందం, ఆరోగ్యం గ్రహబాధ నివారణకి ఈ పారాయణ వల్ల విముక్తి లభిస్తుంది….



తాత్పర్యము:

పాలకడలిలో ఆదిశేషునిపై భోగముతో చక్రమును ధరించి, రత్నములతో శోభిల్లే, పుణ్యమూర్తి యైన, యోగులను శాశ్వతముగా కాపాడే, ఈ సంసార సాగరాన్ని దాటించే నావయైన, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు, సూర్యుడు మొదలగు దేవతల కిరీటములు మోడిన పాదములు కల, మెరిసే పాదములు శోభను ఇనుమడించగా, లక్ష్మీ దేవి స్తన ద్వయము వద్ద రాజహంస యైన, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

మురహరి! సంసారమనే అంధకారములో నేను పయనిస్తూ, కామము అనే సింహముచే దాడి చేయబడి, స్పర్ధ అనే వేడిమిచే బాధ పెట్టబడి ఉన్నాను. కావున, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! సంసారమనే భయంకరమైన, లోతైన బావి అడుగుకు చేరాను. వందలాది దుఖములనే సర్పములచే బాధించబడి, దుఃఖముతో, నిస్సహాయుడనై దీనుడనైతిని. కావున, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! అనంతమైన వెడల్పుగల ఈ సంసారమనే సాగరంలో చిక్కుకున్నాను. ఈ సాగరంలో కాలమనే నల్లని మొసళ్ళ నోట చిక్కి వాటిచే చంప బడుతున్నాను. మోహమనే అలలలో, రుచి మొదలగు వాసనలు వశుడనై ఉన్నాను. కావున, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! పాపమనే బీజము మొలిచి, వృక్షమై, పూర్వ జన్మల కర్మ ఫలములనే క్రొమ్మలు కలిగి, నా శరీర భాగములు ఆకులుగా కలిగి, శుక్రుని ఫలితముగా పుష్పములు కలిగి (వీర్యము అని అర్థము), దుఖమనే ఫలములు కలిగి యుండి. కానీ, నేను దాని పై నుండి వేగముగా జారుచున్నాను. కావున, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! సర్పముల శత్రువైన గరుత్మంతుని వాహనముగా కల, అమృత తుల్యమైన పాల కడలిలో నివసించే ఓ దేవా! సంసారమనే విషసర్పము తన భయంకరమైన నోరు తెరచి విషపు కోరలను నాపై చూపి నన్ను నాశనము చేయుచున్నది. కావున, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! సంసారమనే దావాగ్ని నా శరీరమును, దానిపై ఉన్న ప్రతి రోమమును దహించుచున్నది. నీ పాద పద్మములను శరణు అంటిని. కావున, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! నేను సంసారమనే వలలో చిక్కుకున్నాను. నా ఇంద్రియములు ఈ వలలో చిక్కుకున్నవి. ఈ ఇంద్రియములనే కొక్కెము నా తలను నా నుండి నుండి వేరు చేయుచున్నది. కావున, కావున, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! మాయ అనే మత్త గజముచే నేను దెబ్బ తిన్నాను. నా ముఖ్య అవయవములు పూర్తిగా దెబ్బ తిన్నవి. నేను ప్రాణ భీతితో వ్యాకులుడనై యున్నాను. కావున, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! ఇంద్రియములనే చోరులు నా వివేకమును దొంగిలించుట వలన నేను అంధుడ నైతిని. అంధుడనైన నేను మోహమనే కూపములో పడి కొట్టుకుంటున్నాను. కావున, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! యముని భటులు నన్ను రాగ పాశములచే మెడను బంధించి ముక్కున లాగుతున్నారు. నేను ఏకాకిని, అలసితిని. భీతితో ఉన్నాను. దయాళో! లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

లక్ష్మీపతీ! కమలనాభ!సురేశ! విష్ణో! వైకుంఠ వాసా! కృష్ణ! మధుసూదన! కలువల వంటి కనులు కలవాడా! బ్రహ్మము తెలిసిన వాడ! కేశవా! జనార్దన! వాసుదేవ! లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఒక చేతిలో చక్రము, రెండవ చేతిలో శంఖము కలిగి, ఇంకొక చేతితో లక్ష్మీ దేవిని పట్టుకొని, మరొక చేతితో అభయము, వరములు ఇచ్చే లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! నేను సంసారమనే సాగరములో మునిగి యున్నాను. ఆర్త రక్షకా! ఈ దీనుడను కాపాడుము. ప్రహ్లాదుని దుఖములు పోగొట్టుటకు అవతారమెత్తిన లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, పుండరీకుడు, వ్యాసుడు మొదలగు వారి హృదయములలో మెలిగే దేవా! భక్త ప్రియా! భక్తులను కాపాడే కల్ప వృక్షమా! లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఫల శృతి
లక్ష్మీ నృసింహుని చరణార విందముల మధువును గ్రోలిన తేనెటీగ అయిన శంకరులచే రచించ బడిన ఈ స్తోత్రము పఠించిన జనులకు శుభము కలుగును. ఈ స్తోత్రము నుతించిన హరి భక్తులకు ఆ పరబ్రహ్మ పాదపద్మముల కైంకర్యము కలుగును.

Saturday, 29 August 2020

తెలుగంటే...

 


తెలుగంటే...గోంగూర
తెలుగంటే...గోదారి
తెలుగంటే...గొబ్బిళ్ళు
తెలుగంటే...గోరింట
తెలుగంటే...గుత్తోంకాయ్
తెలుగంటే...కొత్తావకాయ్
తెలుగంటే....పెరుగన్నం
తెలుగంటే...ప్రేమా, జాలీ, అభిమానం
తెలుగంటే...పోతన్న
తెలుగంటే...బాపు
తెలుగంటే...రమణ
తెలుగంటే...అల్లసాని పెద్దన
తెలుగంటే...తెనాలి రామకృష్ణ
తెలుగంటే...పొట్టి శ్రీరాములు
తెలుగంటే...అల్లూరి సీతారామరాజు
తెలుగంటే...కందుకూరి వీరేశలింగం
తెలుగంటే...గురజాడ
తెలుగంటే...శ్రీ శ్రీ
తెలుగంటే...వేమన
తెలుగంటే...నన్నయ
తెలుగంటే...తిక్కన
తెలుగంటే...ఎఱ్ఱాప్రగడ
తెలుగంటే...గురజాడ
తెలుగంటే...క్షేత్రయ్య
తెలుగంటే...శ్రీనాధ
తెలుగంటే...మొల్ల
తెలుగంటే...కంచర్ల గోపన్న
తెలుగంటే....కాళోజి
తెలుగంటే...కృష్ణమాచార్య
తెలుగంటే...సిద్ధేంద్ర
తెలుగంటే...గౌతమీ పుత్ర శాతకార్ణి
తెలుగంటే...రాణీ రుద్రమదేవి
తెలుగంటే...రాజరాజ నరేంద్రుడు
తెలుగంటే...రామలింగ నాయుడు
తెలుగంటే...తిమ్మనాయుడు
తెలుగంటే...రామదాసు
తెలుగంటే...ఆచార్య నాగార్జున
తెలుగంటే...పోతులూరి వీరబ్రహ్మం
తెలుగంటే...జిడ్డు కృష్ణమూర్తి
తెలుగంటే...వుప్పలూరి గోపాల కృష్ణమూర్తి
తెలుగంటే...సింగేరి శంకరాచార్య
తెలుగంటే...అన్నమాచార్య
తెలుగంటే...త్యాగరాజు
తెలుగంటే...వీర పాండ్య కట్టబొమ్మన
తెలుగంటే...విశ్వేశ్వరయ్య
తెలుగంటే...బాబూ రాజేంద్రప్రసాద్
తెలుగంటే...చిన్నయ్య సూరి
తెలుగంటే...సర్వేపల్లి రాధాకృష్ణన్
తెలుగంటే...పీవీ నరసింహారావు
తెలుగంటే...రాజన్న
తెలుగంటే...సుశీల
తెలుగంటే...ఘంటసాల
తెలుగంటే...రామారావు
తెలుగంటే...అక్కినేని
తెలుగంటే...సూర్యకాంతం
తెలుగంటే...ఎస్.వీ.రంగారావు
తెలుగంటే...అయ్యలరాజు రామభద్రుడు
తెలుగంటే...పండుమిరప
తెలుగంటే...సంక్రాంతి
తెలుగంటే...సరోజిని నాయుడు
తెలుగంటే....భద్రాద్రి రామన్న
తెలుగంటే...తిరుపతి ఎంకన్న
తెలుగంటే...మాగాణి
తెలుగంటే...సాంబ్రాణి
తెలుగంటే...ఆడపిల్ల ఓణి
తెలుగంటే...చీరకట్టు
తెలుగంటే...ముద్దపప్పు
తెలుగంటే...ఓంకారం
తెలుగంటే...యమకారం
తెలుగంటే....మమకారం
తెలుగంటే...సంస్కారం
తెలుగంటే...కొంచెం ఎటకారం
తెలుగంటే...పట్టింపు
తెలుగంటే...తెగింపు
తెలుగంటే....లాలింపు
తెలుగంటే...పింగళి వెంకయ్య
తెలుగంటే...పైడి మర్రి వెంకట సుబ్బారావు
తెలుగంటే....టంగుటూరి ప్రకాశం
తెలుగంటే...చిలకమర్తి లక్ష్మీనరసింహం
తెలుగంటే...భాస్కరుడు
తెలుగంటే...దేవులపల్లి
తెలుగంటే...ధూర్జటి
తెలుగంటే...తిరుపతి శాస్త్రి
తెలుగంటే...గుఱ్ఱం జాషువ
తెలుగంటే...కోరాడ మహాదేవశాస్ట్రీ
తెలుగంటే...కోరాడ రామకృష్ణయ్య
తెలుగంటే...కోరాడ రామచంద్రకవి
తెలుగంటే...కొనకళ్ల వెంకటరత్నం
తెలుగంటే...మల్లన్న
తెలుగంటే...నండూరి
తెలుగంటే...పానుగంటి
తెలుగంటే...రామానుజం
తెలుగంటే...రావి శాస్త్రి
తెలుగంటే...రవి వర్మ
తెలుగంటే...రంగనాధుడు
తెలుగంటే...కృష్ణదేవరాయలు
తెలుగంటే...తిరుపతి వెంకటకవులు
తెలుగంటే...విశ్వనాథ
తెలుగంటే...నన్నే చోడుడు
తెలుగంటే...ఆరుద్ర
తెలుగంటే...ఎంకి
తెలుగంటే...ఆదిభట్ల
తెలుగంటే...గాజుల సత్యనారాయణ
తెలుగంటే...మల్లాది సుబ్బమ్మ
తెలుగంటే...ఆర్యభట్టు
తెలుగంటే...త్యాగయ్య
తెలుగంటే...కేతన
తెలుగంటే...వెంపటి చిన సత్యం
తెలుగంటే...ఉషశ్రీ
తెలుగంటే...జంధ్యాల
తెలుగంటే...ముళ్ళపూడి
తెలుగంటే...మంగళంపల్లి బాలమురళీకృష్ణ
తెలుగంటే...అక్కిరాజు ఉమాకాంతం
తెలుగంటే...తిలక్
తెలుగంటే...అడివి బాపిరాజు
తెలుగంటే...జక్కన
తెలుగంటే...అచ్చమాంబ
తెలుగంటే...దాశరథి
తెలుగంటే...తెలంగాణ,ఆంధ్ర
తెలుగంటే...ముక్కుపుడక
తెలుగంటే...పంచెకట్టు
తెలుగంటే...ఇంటిముందు ముగ్గు
తెలుగంటే...నుదుటిమీద బొట్టు
తెలుగంటే...తాంబూలం
తెలుగంటే...పులిహోర
తెలుగంటే....సకినాలు
తెలుగంటే....మిర్చి బజ్జి
తెలుగంటే...బందరు లడ్డు
తెలుగంటే....కాకినాడ ఖాజా
తెలుగంటే.....జీడిపాకం
తెలుగంటే...మామిడి తాండ్ర
తెలుగంటే...రాగి ముద్ద
తెలుగంటే...జొన్న రొట్టె
తెలుగంటే...అంబలి
తెలుగంటే...మల్లినాథ సూరి
తెలుగంటే...భవభూతి
తెలుగంటే...ప్రోలయ నాయకుడు
తెలుగంటే...రాళ్ళపల్లి
తెలుగంటే...కట్టమంచి
తేనెలూరు తెలుగంటే ఆంధ్ర కోనసీమ పంట
తెలుగు నేలంటే రాయలేలిన సీమ రాయలసీమ
తెలుంగు ఆణమంటే తెలంగాణ
తెలుగంటే..... నీవు నేను మనం
జై తెలుగు తల్లీ 🙏

గిడుగు రామ్మూర్తి పంతులు గారికి అంజలి ఘటిస్తూ..🙏
తెలుగు భాషా ప్రేమికులందరికీ
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు💐💐💐🙏🏻
[ Video ]
పాడనా తెనుగు పాట పరవశనై....
అమెరికా అమ్మాయి 1976

Thursday, 20 August 2020

తపస్సు - రచన

 మనసును, ఇంద్రియాలను ఏకాగ్రంగా ఉంచి చిత్తశుద్ధితో, నిష్ఠతో ఓ నామస్మరణో, మంత్రమో జపిస్తూ చేసే ధ్యానమే తపస్సు. అనంతమైన ఆలోచనా ప్రవాహానికి ఏకాగ్రతతో ఆనకట్టవేస్తూ మనసును ఒకే ఆలోచనమీద నిలిపేందుకే ఈ సాధన. లోకకల్యాణానికో, దివ్యశక్తులు పొందాలన్న కోరికతోనో, ఆత్మతత్త్వాన్ని అర్థం చేసుకునేందుకో, సత్యశోధనకో... ఇలా రకరకాల ధ్యేయాలతో తపస్సు చేస్తుంటారు.

ఈ జగత్తు దృశ్యమయం. కొన్ని మనసును పరవశింపజేేసేవి. మరికొన్ని అతలాకుతలం చేసేవి. ‘ఔరా’ అనే విధంగా సంభ్రమాశ్చర్యాలకు లోనుచేసే సంఘటనలు ఇంకొన్ని. వీటిని అందరూ చూస్తూ భావోద్వేగాలకు గురైనా, కొందరు మాత్రమే వాటికి అక్షర రూపాన్నిస్తారు. అదే రచన. ఏకాగ్రత, మనోనిగ్రహం, చిత్తశుద్ధి తపస్సుకెంత ఆవశ్యకమో- రచనకూ అంతే. ఆ దృష్టితో చూసినపుడు తపస్సు, రచన రెండూ ఉత్కృష్టమైనవే, ఉదాత్తమైనవే.

మనసు కంటే చంచలమైనది ఏదీ ఉండదు. ఇటువంటి మనసులో ఒకే ఆలోచనను, లేదా విషయాన్ని నిలుపుకొని ధ్యానించడమే తపస్సు. రచనలోనూ అదే జరుగుతుంది. తన కళ్లు చూసిన అనేకానేక దృశ్య, ఘటనల సమాహారంనుంచి తనను ప్రభావితం చేసినవాటికి అక్షరరూపాన్నిచ్చే యత్నం చేస్తాడు రచయిత. దృష్టి సారించవలసిన అంశం నుంచి తాపసిని, రచయితను అనేక ఇతర విషయాలు మళ్ళించజూస్తాయి. అప్పుడే వాటిని ఆపగలగాలి. అలా సాధ్యం కాకపోతే వాటి ప్రభావం తాము దృష్టి పెట్టవలసిన ఆలోచనమీద పడకుండా చూసుకోవాలి. క్రమక్రమంగా మనసుకు ఓ కుదురు ఏర్పడుతుంది.

రచయితకు తాను సృజించదలుచుకున్న అంశం మీద స్పష్టత రావాలి. తాను చెప్పదలచుకున్న విషయం మీద ఓ పట్టును సాధించాలి. ఎడతెగని ఆలోచనా తరంగాలను దాటి తనకు కావలసిన ఆలోచనా పథంలో పయనించడాన్ని రచయిత అలవరచుకోవాలి. ఎంతో సాధన చేయాలి. తాపసికీ ఇదే వర్తిస్తుంది.

తపస్సంటే ఒకరకంగా మన ఆలోచనాశక్తినంతా ఒక అంశం మీద కేంద్రీకరించటం. దానిగురించి లోతుగా, విస్తృతంగా ఆలోచించటం. మనం దృష్టి నిలిపిన అంశం లోతుపాతులను, దాన్ని అన్ని పార్శ్వాలను దర్శించడం.

తపస్సుకైనా, రచనకైనా మనోనిశ్చలత కావాలి. దీనివల్ల ఓ ప్రశాంతస్థితి వస్తుంది. మనసొక నిర్మల తటాకమవుతుంది. అస్పష్టతనే సుడిగాలి నుంచి బయటపడిన తన అద్భుత భావదొంతరను సముచితమైన పదాలతో, పదబంధాలతో వ్యక్తీకరిస్తాడు.

మనసు, బుద్ధి అనే జోడు గుర్రాలమీద స్వారీ చేస్తూ, వాటిని స్వాధీనంలో ఉంచుకోవడం తాపసికి అవసరం. అంతటి నిశ్చల స్థితిని, ఆనంద స్థాయిని రచయితా పొందాలి.

రామాయణ, మహాభారతాలను రచించిన వాల్మీకి, వేదవ్యాసుడు తపోధనులు. పవిత్ర భావనతో ధర్మచింతనతో, ఆ రచనలను మహాకావ్యాలుగా తీర్చిదిద్ది లోకానికి అందించారు. అవి జాతి జీవనానికి మార్గ నిర్దేశకంగా నిలిచాయి.

ఏకాగ్రత, మనోనిశ్చలత, దార్శినిక దృష్టి- అయాచితంగా రావు. నిరంతర సాధనతో, తపనతో, అకుంఠిత దీక్షతో సాధించుకోవాలి.

భాద్రపద మాసం

 హైందవ సంప్రదాయంలో ప్రతి మాసానికీ ఏదో ఒక విశేషం ఉంటుంది. వాటిల్లో ముఖ్యమైంది భాద్రపదం. దేవతా పూజలకు, పితృదేవతల పూజకు కూడా ఉత్కృష్టమైన మాసం ’భాద్రపద మాసం’. చాంద్రమానం ప్రకరం భాద్రపద మాసం ఆరవమాసం. ఈ మాసంలోని పూర్ణిమ తిథినాడు చంద్రుడు పూర్వాభాద్ర నక్షత్రం సమీపంలోగాని, ఉత్తరాభాద్ర నక్షత్రం సమీపంలోగానీ ఉండడంవల్ల ఈ మాసానికి ’భాద్రపద మాసం ’ అనే పేరు ఏర్పడింది. భాద్రపద మాసం వర్షఋతువులో రెండో మాసం. చాంద్రమానం ప్రకారం పౌర్ణమి రోజున చంద్రుడు పూర్వాభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో సంచరించడం వల్ల ఈ మాసానికి భాద్రపదం (20 ఆగస్టు నుంచి—17-సెప్టెంబర్) అనే పేరువచ్చింది. తొలిపూజలందుకునే వినాయకుడు పుట్టిందీ, స్థితికారకుడైన శ్రీహరి భక్తులను రక్షించడానికి వరాహ, వామనావతారాలు ధరించిందీ ఈ మాసంలోనే. భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఉత్కృష్టమైన కాలం కాగా, కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనలకు అత్యంత ప్రీతికరమైన కాలంగా పురాణాలు చెబుతున్నాయి. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకు శ్రీమహావిష్ణువు దశావతారాలను ధరించినట్లు అందరికీ తెలిసిన విషయమే. అట్టి దశావతారాలలో మూడవ అవతారమైన శ్రీ వరాహ అవతారాన్ని, ఐదవదైన శ్రీ వామనావతారాన్ని భాద్రపద మాసంలోనే శ్రీమన్నారాయణుడు ధరించి దుష్టశిక్షణ గావించాడు.అందుకే ఈ మాసంలో ’దశావతార వ్రతం’ చెయాలనే శాస్త్ర వచనం. భాద్రపదమాసంలోని అష్టమి శ్రీకృష్ణ పరమాత్మ పూజకు ఉత్కృష్టమైన రోజు. ఈ నాడు పవిత్ర ప్రేమకు చిహ్నంగా చెప్పబడుతూ ఉన్న శ్రీ రాధాకృష్ణులను పూజించాలి. ఈ దినానికి ’రాధాష్టమి’ అని పేరు. భాద్రపద మాసంలో వచ్చే అతి పెద్ద పండగ వినాయక చవితి. ఊరూవాడా చిన్నాపెద్దా అన్న తేడాలేకుండా ప్రతి ఒక్కరూ గణనాథుడిని శక్తిమేర పూజిస్తారు. అయితే దానికంటే ముందు వచ్చే విశేషం. శుద్ధ తదియనాటి వరాహ జయంతి. కల్పాంత సమయంలో భూమి మొత్తం జలమయమైపోయింది. ఆ సమయంలో బ్రహ్మదేవుడు మనువును పిలిచి భూమిని పాలించాల్సిందిగా ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు మనువు నీట మునిగిన భూమిని పైకి తీసుకురావాల్సిందిగా బ్రహ్మను ప్రార్థిస్తాడు. ఆ సమయంలోనే బ్రహ్మ తుమ్మగా ఆ తుమ్ము నుంచి యజ్ఞవరాహమూర్తి పుడతాడు. యజ్ఞవరాహం అంటే యజ్ఞంలో ఉపయోగించే ద్రవ్యాలనే శరీరభాగాలుగా కలిగినవాడని అర్థం.
ఈ మాసంలో రెండు ముఖ్యమైన విశేషాలున్నాయి. మొదటగా శుక్ల పక్షంలో దేవతలకు, పూజలకు, నోములకు వ్రతాలకు ప్రాధాన్యత ఇస్తే, రెండోదైన కృష్ణపక్షంలో పితృదేవతలకు అనుకూలమైన మాసంగా పరిగణిస్తారు.
పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు దుష్టులను శిక్షించడానికి పది అవతారాలు ఎత్తాడనే విషయం చాలా మందికి తెలుసు. అయితే అందులోని వరహా, వామన అవతారానికి ఈ మాసంలోనే ప్రత్యేక పూజలు చేస్తారు. అందుకే ఈ మాసంలో దశావతార వ్రతం చేయాలంటారు పండితులు.
బొటన వేలంత దేహంతో పుట్టిన స్వామి క్షణాల్లో ఆకాశమంత ఎత్తు పెరిగిపోతాడు. హిరణ్యాక్షుడితో యుద్ధం చేసి మరీ సముద్రంలో ఉన్న భూమిని పైకెత్తి తన కోరలమీద నిలబెట్టాడు. విష్ణుమూర్తి ధరించిన దశావతారాల్లో మూడో అవతారమే వరాహ అవతారం. ఆ రోజు మరో విశేషం కూడా ఉంది.
అదే పదహారు కుడుముల తద్దె. ఆ రోజున గౌరీదేవిని ఆరాధిస్తే అష్టైశ్వర్యాలూ సిద్ధిస్తాయంటారు. భాద్రపద శుద్ధ చవితినే వినాయక చవితిగా జరుపుకుంటారు. ఈ రోజున భక్తిశ్రద్ధలతో గణపయ్యను పూజిస్తే విద్యాబుద్ధులతోపాటు సకల సంపదలూ లభిస్తాయి.
మర్నాడు రుషి పంచమి. ఈ వ్రతం గురించి శ్రీకృష్ణుడే స్వయంగా ధర్మరాజుతో చెప్పాడంటారు. ఈ వ్రతం చేసేటప్పుడు కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు మొదలైన సప్తరుషులతోపాటు అరుంధతీ దేవినీ ఆరాధించాలి.ఆ తర్వాతి రోజు షష్ఠి. దీన్నే స్కంద షష్ఠి, సూర్యషష్ఠి అని కూడా అంటారు.
నిజానికి మాఘమాసంలో మాదిరిగానే భాద్రపద మాసంలో వచ్చే అన్ని ఆదివారాలూ సూర్యభగవానుడిని అర్చించడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుందని చెబుతారు. ఈ నెలలో వచ్చే ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు. తొలి ఏకాదశినాడు పాలసముద్రంలో శేషతల్పంమీద శయనించిన విష్ణుమూర్తి పరివర్తన ఏకాదశి రోజున మరో పక్కకి ఒత్తిగిలుతాడు. ఈ రోజంతా ఉపవాసం ఉండి శ్రీహరిని స్మరిస్తే కరవుకాటకాలు దరిచేరవట.
భాద్రపద మాసం శుక్ల పక్షంలో వచ్చే మరో ప్రత్యేక తిథి ద్వాదశి. శ్రవణా నక్షత్రం ఉన్న ఈ రోజునే వామనావతారానికి శ్రీకారం చుట్టాడు శ్రీహరి. ప్రహ్లాదుడి మనవడైన బలిచక్రవర్తి పరమ ధార్మికుడు. అతడు స్వర్గాన్ని జయించడంతో దేవతలు అక్కణ్ణుంచి వెళ్లిపోవాల్సి వస్తుంది.
బలిచక్రవర్తిని సంహరించకుండానే అతడి నుంచి స్వర్గాన్ని తీసుకుని దేవతలకు ఇచ్చేందుకు. అదితి, కశ్యప ప్రజాపతులకు బిడ్డగా జన్మిస్తాడు శ్రీహరి. సకల భూమండలాన్నీ స్వర్గాన్నీ దానంగా పొందుతాడు. దానికి ప్రతిగా సుతల లోకాన్ని బలిచక్రవర్తికి ఇచ్చి, చివరిలో మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అందుకే ఈ రోజున శ్రీహరిని స్మరించినంతనే మోక్షం లభిస్తుందట. పౌర్ణమి రోజున ఉమామహేశ్వర వ్రతాన్ని చేస్తారు. పార్వతీదేవి ఈ వ్రతాన్ని చేసి శివుడి శరీరంలోని అర్ధభాగాన్ని మళ్లీ పొందిందని చెబుతారు.
శ్రావణమాసం వెళ్లిపోయింది. మంగళగౌరి నోము, వరలక్ష్మి వ్రతాలతో సందడిగా ఉన్న ఇళ్లన్నీ ఒక్కసారి నిశ్శబ్దంగా మారిపోయాయి. కానీ శ్రావణం తర్వాత వచ్చే భాద్రపదమూ ప్రత్యేకమే! భాద్రపదంలో ఒకో రోజు గడిచేకొద్దీ ఊరంతా హోరెత్తిపోతుంది. మరి వినాయక చవితి వచ్చేది ఈ నెలలోనే కదా! ఆ చవితి రోజున స్వామి రూపాన్ని మట్టితో రూపొందించి, ఆ రూపాన్ని పత్రితో పూజిస్తాం. సర్వ శుభాలనూ కలిగించే ఆ విఘ్నాధిపతిని పూర్తిగా ప్రకృతితోనే పూజించి, ప్రకృతిలోనే నిమజ్జనం చేయడం ఈ పండుగకే ప్రత్యేకం.
ఒక్క చవితే కాదు, భాద్రపదంలో ప్రతి తిథీ ప్రత్యేకమే! వినాయక చవితి తర్వాత వచ్చే పంచమిని రుషిపంచమి అని పిలుస్తారు.  ఆ రోజున స్త్రీలంతా సప్తర్షులని పూజిస్తూ ఉపవాసం ఉంటారు. అలా చేస్తే... రుషుల అనుగ్రహంతో వారిలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. ఆ తర్వాత వచ్చే సూర్యషష్టి, లలితా సప్తమి, రాధాష్టమి తిథులలో ఆయా దేవతలని పూజిస్తారు. ఇలా ఒకో తిథినీ దాటుతూ పరివర్తన ఏకాదశి వస్తుంది.
తొలిఏకాదశి రోజున శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తి, పరివర్తన ఏకాదశి రోజున మరోపక్కకి ఒత్తిగిలుతాడని అంటారు. అందుకే ఈ రోజుకి ‘పరివర్తన ఏకాదశి’ అన్న పేరు వచ్చింది. కానీ ఈ పేరు వెనక చాలా నిగూఢ అర్థాలే కనిపిస్తాయి. ఆనాటికి రుతువులలో వచ్చే మార్పునీ, మనుషులలో పరివర్తన రావల్సిన అవసరాన్నీ అది సూచిస్తుంది. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి జాగరణ చేస్తే... గృహస్థు జీవితంలో చేసిన పాపాలన్నీ నశించిపోతాయని చెబుతారు.
పరివర్తన ఏకాదశి మర్నాడే వామన జయంతి వస్తుంది. విష్ణుమూర్తి అవతారమైన వామనుడు ఉద్భవించింది ఈ రోజునే! వామనుడే కాదు, బలరాముడు, వరాహస్వామి కూడా ఈ మాసంలోనే అవతరించారని చెబుతారు. భాద్రపదమాసంలో మరో ప్రత్యేకత మహాలయ పక్షం. భాద్రపద పౌర్ణమి మర్నాడు నుంచి పదిహేను రోజుల పాటు ఈ మహాలయ పక్షం వస్తుంది. పితృదేవతలందరినీ ఈ కాలంలో తల్చుకోవడం ఆనవాయితీ.
భాద్రపదంలో పండుగలే కాదు... నోములు, వ్రతాలకి కూడా కొదవ లేదు. భాద్రపద శుద్ధ చతుర్దశి రోజున వచ్చే అనంతపద్మనాభస్వామి వ్రతం ఇందులో ముఖ్యమైనది. ఈ రోజున ఆ పద్మనాభస్వామిని కొలిచినవారి కష్టాలన్నీ తీరిపోతాయని అంటారు. ఇదే కాకుండా ఉండ్రాళ్ల తద్ది నోము, ఉమామహేశ్వర వ్రతం కూడా గుర్తుంచుకోదగ్గవే!
ఇదీ భాద్రపదంలోని కొన్ని ప్రత్యేకతలు. ఇంత విశేషమైన మాసం కాబట్టే కొందరు అసలు కలియుగమే భాద్రపదంలో మొదలైందని నమ్ముతారు. భాద్రపదం అన్న పేరు కేవలం నక్షత్రాన్ని మాత్రమే సూచించదు. ఆ మాసంలో ప్రజలంతా ‘భద్రంగా’ ఉండాలన్న ఆలోచనతో ఆ పేరు పెట్టినట్లు తోస్తుంది.
భాధ్రపదంలో స్త్రీలు చేయాల్సిన వ్రతాలు : హరితాళిక వ్రతం , సువర్ణగౌరీ వ్రతం
భాద్రపద శుక్ల పక్ష తదియనాడు ’ హరితాళిక వ్రతం’ లేదా ’ సువర్ణ గౌరీ వ్రతం ’ ’పదహారు కుడుముల తద్ది’ ఆచరిస్తారు. శివపార్వతులను పూజించి, పదహారు కుడుములను తయారుచేసి నైవేద్యంగా సమర్పించవలెను. ఈ పూజను కన్యలు పాటించడంవల్ల వారికి మంచి భర్త లభిస్తాడు. ముత్తయిదువలు పాటించడంవల్ల వారి సౌభాగ్యం అభివృద్ధి చెందుతుందని శాస్త్ర వచనం.
ఉండ్రాళ్ళ తద్ది
భాద్రపద బహుళ తదియ నాడు అవివాహితలు చేసే వ్రతం . తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి దేవతాపూజ చేసి, ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి సాయంత్రం ఊయలలో వూగుతారు.
భాద్రపద మాసంలో పండుగలు
శుక్ల చవితి : వినాయక చవితి
ఏ పూజ అయినా, వ్రతమైనా, చివరకు ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా వినాయకుడిని పూజించడం మన సాంప్రదాయం. అటువంటి వినాయకుడి జన్మదినంను ’వినాయక చవితి’ లేదా ’ గణేశ చతుర్ధి’ పర్వదినంగా జరుపుకుంటారు. ఈనాడు వినాయకుడి ప్రతిమను ఇంటిలో ప్రతిష్టించి స్వామివారికి పూజ చేసి గరికతో పాటు, 21 పత్రాల్తో పూజించి , వ్రతకథ చెప్పుకుని, ఉండ్రాళ్ళు, కుడుములను నైవేద్యంగా సమర్పించవలెను.
శుక్ల ఏకాదశి : పరివర్తన ఏకాదశి
తొలి ఏకాదశినాడు క్షీరాబ్దిపై శేషతల్పంమీద శయనించిన శ్రీమహావిష్ణువు ఈ దిన ప్రక్కకు పొర్లుతాడు అంటే పరివర్తన చెందుతాడు కనుక దీనికి ’పరివర్తన ఏకాదశి’ అని, ’విష్ణు పరివర్తన ఏకాదశి’ అని ’పద్మ పరివర్తన ఏకాదశి’ అని పేరు. ఈనాడు ఏకాదశి వ్రతం ఆచరించడంవల్ల కరువుకాటకాలు రావని, వచ్చి వుంటే విముక్తి లభిస్తుందని కథనం.
శుక్ల ద్వాదశి : వామన జయంతి
దశావతారాల్లో ఐదవదైన వామనావతారాన్ని శ్రీమహావిష్ణువు ఈ దినం ధరించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈనాడు వామనుడిని పూజించి, వివిధ నైవేద్యములు సమర్పించి, పెరుగును దానం చేయాలని శాస్త్ర వచనం.
శుక్ల చతుర్డశి : అనంత చతుర్ధశి
అనంతుడు అనేది శ్రీమహావిష్ణువుకు ఉండే పేర్లలో ఒకటి. శ్రీమహావిష్ణువును అనంతుడిగా పూజిస్తూ చేసే వ్రతమునకే ’అనంత చతుర్దశి వ్రతం’ లేదా ’ అనంత పద్మనాభ వ్రతం’ అని పేర్లు. ఈ వ్రతం గురించి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించినట్లు భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది.

Sunday, 4 February 2018

*👉ప్రతి విషయాన్ని అనేక కోణాలలో ఆలోచించొచ్చు, కానీ పాజిటివ్ గా విశ్లేషించండి👈

*👉ప్రతి విషయాన్ని అనేక కోణాలలో ఆలోచించొచ్చు, కానీ పాజిటివ్ గా విశ్లేషించండి👈*
1. కళ్ళద్దాలు తుడుచుకోవటం మర్చిపోయి, ఈ ప్రపంచం మురికిగా ఉందని ఫిర్యాదు చేయవద్దు.
2. కవి అన్నవాడు ఎప్పుడూ ఆకలితో అలమటించే వాడుగా గాని లేదా భగ్న ప్రేమికుడిగా గాని ఉండాలి.
3. కష్టపడి పనిచేసేవారికి అవకాశాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయి.
4. కష్టాలను జయించడానికి నిస్పృహకంటే చిరునవ్వు చాలా బలవంతమైనది.
5. కష్టాలను తప్పించుకోవడం కాదు, వాటిని అధిగమించడమే నిజంగా గొప్పదనం.
6. కష్టాలు మన జీవితాలను మెరుగుదిద్దేందుకే కాని నాశనం చేయడానికి కాదు.
7. కామంనకు మించిన వ్యాధీ, బ్రాంతికి మించిన శత్రువూ, కోపానికి మించిన అగ్నీ, విద్యకు మించిన ఆనందం వేరొకటి లేదు.
8. కార్యశూరుడి వలె ఆలోచించు, అలోచనాపరుడిగా వ్యవహరించు.
9. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటిన మేధావి కూడా కళ్ళు తడపకుండా జీవితాన్ని దాటలేడు.
10. కావలసిన దానికంటే ఎక్కువ వివేకం కలిగి ఉండడం వివేకం అనిపించుకోదు.
11. కావలసిన దానికన్నా ఎక్కువ తీసుకొని దాస్తే మనం దొంగలం.
12. కీర్తి పొందని పుట్టుక నిష్ఫలము.
13. కుంటివాని వద్ద నడక, మూగవాని వద్ద మాటలు నేర్వడం కుదరదు.
14. కుక్కకు ఎముక వేయడం దానం కాదు. కుక్కకున్నంత ఆకలి నీకున్నప్పుడు ఆ కుక్కతో ఎముకను పంచుకోవడం నిజమైన దానం.
15. కృతజ్ఞత అనేది ఒకరిపట్ల చూపవలసిందే కాని ఒకరి నుండి ఆశించవలసింది కాదు.
16. కొద్ది కోరికలతో, చిన్న విషయాలతో తృప్తి పడటమే ఉత్తముని లక్షణం.
17. కొన్ని పట్టులాంటి ముఖాల వెనుక ముతక గుడ్డ ఉంటుంది.
18. కోపం పాపానికి ధూపం. రోషం దోషానికి మూలం.
19. కోపం యమధర్మరాజు లాంటిది.తృష్ణ వైతరణిలాంటిది. విద్య కామధేనువులాంటిది. ఇక సంతృప్తి దేవరాజైన ఇంద్రుడి నందనవనం లాంటిది.
20. కోపానికి కారణమైన గాయంకంటే అణచుకోని కోపం ఎక్కువ హాని కలిగిస్తుంది.
21. కోరిక ముగించిన చోట శాంతి ప్రారంభిస్తుంది.
22. కోరికల యొక్క యదార్థ స్వరూపం దుఃఖం.
23. క్రమబద్దతను పాటించకుండా సంపద, పరాక్రమం లేకుండా విజయం, ఉపకార గుణం లేకుండా పేరు, ఆధ్యాత్మిక ఙ్ఞానం లేకుండా ముక్తి లభించవు.
24. క్రోధాన్ని జయించిన వ్యక్తి అందరినీ జయిస్తాడు.
25. క్షణిక కోపాన్ని అణుచుకోగల వ్యక్తి ఒక రోజు దు:ఖాన్ని దూరం చేసుకోగలడు.
26. గంపెడు చదువుకంటే పిడికెడు లోకజ్ఞానం విలువైనది.
27. గతం త్రవ్వకండి. వర్తమానంలో పనిచేస్తూ భవిష్యత్తు నిర్మించండి.
28. గతం నుండి నేర్చుకోండి, కాని దాని కారణంగా దిగులుపడకండి.
29. గతమే వర్తమానానికి మార్గం.
30. గమ్యం చేరుకోవటం కంటే, నమ్మకంతో ప్రయాణం చేయటమే మేలైనది.
31. గర్వం వినాశనానికి ముందు పోతుంది. అహంకారం పతనానికి ముందు పోతుంది.
32. గుండెలోని భావాలను చెప్పని మాట వట్టి కళేబరం.
33. గుడ్డివాడికి మరో గుడ్డివాడు దారి చూపితే ఇద్దరూ గోతిలో పడతారు.
34. గురి వల్ల గొప్ప విలుకాడు అవుతాడే కాని పొదలో ఉన్న బాణాల వల్ల కాదు - ధామస్ ఫుల్లర్
35. గెలుపు అందవిహీనతను మరుగుపరిచే అరుదైన రంగు.
36. గొప్ప అంశాలు రూపొందేదే కర్మాగారం.
37. గొప్ప అణుకువ గల వ్యక్తి గొప్పకు చేరువవుతాడు.
38. గొప్ప ఆలోచనలను కలిగి ఉన్నవారు ఎప్పుడూ ఒంటరిగా ఉండరు.
39. గొప్ప గొప్ప కార్యాలను సాధించటానికి ఉత్సాహమే ప్రధాన కారణం.
40. గొప్ప పనుల సుగంధమే పేరు ప్రతిష్టలు.
41. గొప్పపనలు చేయడానికి కావలసింది ముఖ్యంగా శక్తికాదు - ఓపిక.
42. గొప్పవారి యొక్క గొప్పతనం, వారు చిన్నవారితో ప్రవర్తించే తీరును బట్టి తెలుస్తుంది.
43. గొప్పవారిలోని గొప్పగుణాలు గుర్తించండి. వాటి గురించి రోజూ కాసేపు మననం చేసుకోండి.
44. గౌరవాలు పొందడం కాదు గొప్ప - వాటికి తగిన అర్హత సాధించడం గొప్ప.
45. ఙ్ఞాన, తప, యోగ మార్గాలకన్న సేవామార్గం మిన్న.
46. ఙ్ఞానం అనేది మనం సంపాదిస్తే వచ్చేది కాదు. మనలోని అఙ్ఞానాన్ని విడిచిపెడితే వచ్చేది.
47. ఙ్ఞానం అమాంతంగా పొంగి పొర్లిపోదు, అది అంచెలంచెలుగ అభివృద్ధి చెందుతుంది.
48. ఙ్ఞానాన్ని మించిన శక్తి ప్రపంచంలో మరేదీ లేనే లేదు
49. చక్కగా తీర్చిదిద్దబడిన ఒక మంచి వ్యక్తి జీవితమే ఈ ప్రపంచంలో అతి పరిపూర్ణం అయిన అందమైన వస్తువు.
50. చక్కటి ఆలోచన, సరైన ముందుచూపు లేని మనిషి జీవితంలో అడుగడుగునా ఆపదలు చుట్టుముడతాయి.

Wednesday, 2 August 2017

సాయి సందేశం ‘సబ్‌కా మాలిక్‌ ఏక్‌’

సబ్‌కా మాలిక్‌ ఏక్‌ అన్న సందేశంతో యావత్‌ మానవాళికి శాంతి సందేశాన్నిచ్చిన సాయి భగవాన్‌ మందిరం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లా షిర్డిలో వుంది. ఫకీర్‌ అవతారంలోఅనేక మహిమలు ప్రదర్శించిన సాయినాధుడు ఇప్పటికీ సమాధి నుంచే భక్తులకు అభయమిస్తాడని అసంఖ్యాక సాయి భక్తుల నమ్మకం. సాయి మందిరాన్ని దర్శించుకునేందుకు రోజు వేలాది భక్తులు షిర్డికి వస్తుంటారు.
శ్రద్ధ, సబూరి
 శ్రద్ధ అంటే విశ్వాసం, భక్తి, సబూరి అంటే ఓర్పు, సాధన సందేశాలతో మానవాళికి అమూల్యమైన శాంతి సందేశాన్ని ఇచ్చారు. సాయినాధుడు ఎక్కడ జన్మించారు అన్న అంశంపై వేర్వేరు వాదనలు వున్నాయి. అహ్మద్‌నగర్‌ జిల్లాలోనే 19 శతాబ్దంలో జన్మించినట్టు కొందరు పర్బానీ జిల్లాలో జన్మించినట్టు మరికొందరు పేర్కొంటారు. అయితే ఈ వాదాలను పక్కనబెడితే హిందూ, ముస్లింల మధ్య సఖ్యతకు కృషి చేసిన మహనీయుల్లో ఆయన అగ్రగణ్యుడు. షిర్డిలోని పాత మసీదు మందిరాన్నే తన నివాసంగా చేసుకొని మత సామరస్యత కోసం శ్రమించారు. ఇప్పుడు ఆ మందిరాన్ని ద్వారకామాయిగా పిలుస్తున్నారు. సమాధి మందిరం పక్కన వున్న గురుస్థానంలో ఆయన కూర్చొనివుండేవారు. తొలిసారిగా 1854లో బాలసాయిని వీక్షించిన గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. ఎప్పుడూ ధ్యానంలో వుండే సాయిని అనేక ప్రశ్నలు అడిగేవారు. అనంతరం ఆయన కొంతకాలం కనిపించలేదు.
ఆవో సాయి.. 
 షిర్డి గ్రామంలోని ఖండోబా మందిరంలో మహాల్సాపతి పూజరిగా వుండేవారు. ఒకసారి సాయి ఆ గ్రామంలోకి తిరిగి ప్రవేశించారు. ఆయనను చూసిన మహల్సాపతి ఆవో సాయి అని ఆహ్వానించారు. దీంతో ఆయన నామం సాయిగా స్థిరపడింది. భగవుంతునికి ఎలాంటి పేర్లు వుండవు. భక్తులు ఏ పేరుతో పిలిస్తే పలుకుతారు అదే రీతిలో సాయిబాబాగా ప్రఖ్యాతిచెందారు. సాయి మహిమలను వీక్షించిన అనేక మంది ఆయన శిష్యులుగా మారారు. మహాల్సాపతి, శ్యామ, హరి సీతారాం, దామోదర్‌... తదితరులు ఆయన శిష్యగణంలో వుండేవారు. స్వామివారి మహిమలు దేశమంతటా వ్యాపించడంతో అనేకమంది భక్తులు షిర్డికి రావడం ప్రారంభించారు. 1918లో ఆయన సమాధి చెందారు. అయితే సమాధినుంచే భక్తులను అభయమిస్తుంటాను అన్న ఆయన దివ్యవ్యాఖ్యల ఫలితంగా షిర్డిక్షేత్రం భక్తజనక్షేత్రంగా మారిపోయింది.
సమాధిమందిర నిర్మాణం: 
బాబా భక్తులలో నాగ్‌పూర్‌కు చెందిన గోపాల్‌రావు బూటి ఒకరు. ఆయన కలలో స్వామి కనిపించి తనకు సమాధి మందిరాన్ని నిర్మించమని కోరారు. దీంతో బూటి ఆయనకు మందిరాన్ని నిర్మించారు. అదే మనం నేడు చూస్తున్న సమాధి మందిరం. షిర్డి ప్రవేశమే అన్ని పాపాలకు పరిహారం అన్న బాబా సూక్తికి అనుగుణంగా ప్రతిరోజు వేలాదిమంది భక్తులు సాయి సన్నిధానానికి వస్తుంటారు. మందిరప్రవేశంతోనే స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షిస్తూ దివ్యానుభూతి చెందుతారు. ద్వారకామాయితో పాటు చావడి, గురుస్థానం, నందదీప్‌, లెండి గార్డెన్స్‌... తదితర ప్రాంతాలను మనం చూడవచ్చు. ఈ ప్రదేశాల్లో సాయి నడియాడిన అంశం మనకు గుర్తుకు వస్తే మనస్సులో ఆధ్మాత్మిక భావం అలముకుంటుంది. సాయి సంస్థాన్‌ వారు బాబా వస్తువులతో ప్రత్యేకంగా ఒక ప్రదర్శనశాలను ఏర్పాటుచేశారు. వీటిని కూడా వీక్షించవచ్చు.
వసతి సౌకర్యం 
 * సంస్థాన్‌ వారు అనేక వసతి సముదాయాలను నిర్వహిస్తున్నారు. వీటిని ఆన్‌లైన్‌ ద్వారా ముందుగానే రిజర్వ్‌ చేసుకోవచ్చు, * ప్రైవేటు వసతి గృహాలు ఎక్కువగా వున్నాయి. భక్తులు వారి ఆర్థిక స్థోమతకు తగినట్టుగా గదులను తీసుకోవచ్చు. ఎలా చేరుకోవచ్చు * దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి షిర్డికి రైలు, బస్సు సౌకర్యముంది. * హైదరాబాద్‌ నుంచి అజంతా ఎక్స్‌ప్రెస్‌, సాయినగర్‌ ఎక్స్‌ప్రెస్‌లు వున్నాయి. * అజంతా ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లేవారు దిగివలసిన స్టేషన్‌ నాగర్‌సోల్‌. అక్కడ నుంచి షిర్డికి అనేక వాహనాలు వుంటాయి. * సాయినగర్‌ ఎక్స్‌ప్రెస్‌లో వెళితే నేరుగా షిర్డి చేరుకోవచ్చు. * షిర్డి సమీపంలో విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే సర్వీసులు ప్రారంభం కానున్నాయి. * ఔరంగాబాద్‌ విమానాశ్రయంలో దిగి వాహనాల ద్వారా షిర్డి చేరుకోవచ్చు.